విజయనగరం అక్టోబర్ 18 :వాహన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి పొందగలుగుతామని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మూడవ శనివారం ‘స్వచ్ఛమైన గాలి ‘ అనే అంశంతో పెద్దచెరువు గట్టున ఉన్న గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన పన్నెండుమంది పారిశుద్ధ్య కార్మికులను దుశ్శాలువలతో సత్కరించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ భాద్యత తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు కాలుష్యం మీద అవగాహన కల్పించి భావితరాలు పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా కృషిచేయాలని అన్నారు. విజయనగరం పట్టణంలో నగరపాలక సంస్థ ద్వారా సుమారు ఏబైవేల పండ్ల మొక్కలు పంపిణీ చాలా ఆనందదాయకమని కలెక్టర్ తెలిపారు.
అనంతరం గాంధీ విగ్రహం ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా అధికారులు, రాజకీయ ప్రతినిధులు, పాత్రికేయులు, పారిశుధ్య కార్మికులతో కలెక్టర్ దగ్గరుండి మొక్కలు నాటించారు.
స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ విజయనగరం అనే నినాదంతో ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య, జిల్లా కాలుష్యనియంత్రణాధికారిని సరిత, ఐ సీ డి ఎస్ పి డి విమలా రాణి, మెప్మా పి డి చిట్టిరాజు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు .
