పీఎం-రాహత్ ద్వారా రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు రూ. 1.5 లక్షల నగదు రహిత వైద్యం,’ గోల్డెన్’ అవర్ లో చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలకు భరోసా డాక్టర్ ఎన్డీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా పీఎం-రాహత్ పథకం అమలు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, ఏప్రిల్ 20: రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు ఉచిత తక్షణ వైద్యం సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రాహత్ పథకాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం-రాహత్ పథకం పోస్టర్ను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్’ అవర్లో రూ.1.5 లక్షల వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన పీఎం-రాహత్ పథకాన్ని జిల్లా లో ట్రస్టు అనుబంధ గుర్తింపు పొంది ఆర్థో, పాలీట్రామా సేవలు అందుబాటులో ఉన్న 23 ప్రభుత్వాసుపత్రుల్లో అమలు చేస్తున్నామని ప్రకటించారు. పీఎం-రాహత్ పథకం అమలు కోసం ట్రస్టు కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితుల ఆర్థిక పరిస్థితులు, స్థానికతతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే అసుపత్రుల్లో చేరినప్పుడు తక్షణ సాయం కింద ఏడు రోజులపాటు లేదా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అసుపత్రులు అందిస్తాయని తెలిపారు.
ఇన్ పేషెంట్ గా ఏడు రోజులు పాటు ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఈ పథకం అమలులో ముఖ్యంగా ‘గోల్డెన్ అవర్లో నగదు రహిత విధానంలో చికిత్స అందించడంవల్ల విలువైన ప్రాణాలు దక్కుతాయన్నారు. సత్వర చికిత్సతో త్వరగా క్షతగాత్రులు కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ కె. సాయిరాం, ఎన్ఐసి డిస్టిక్ మేనేజర్ ఎం. శ్రీధర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
