విజయనగరం, నవంబర్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని గ్రామాల్లో అర్హత ఉండి ఇల్లు లేని నిరుపేదల కోసం 100% డిమాండ్ సర్వే జరుగుతోందనీ తెలిపారు. పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఉందని, అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాబోయే 5 సంవత్సరాలలో ఎవరికైనా పక్కా ఇల్లు కావాలంటే, ఈ నెలాఖరులోపు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన లో స్పష్టం చేశారు. అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎవరు నమోదు చేసుకోవచ్చు?
గృహం లేని మరియు స్థలం లేని కుటుంబీకులు.
తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
ఇంతకు ముందు ఏ ఇతర ప్రభుత్వ పథకంలోనూ లబ్ధి పొంది ఉండకూడదు.
సొంత స్థలం ఉన్నా లేకపోయినా నమోదు చేసుకోవచ్చు. స్థలం లేని వారికి, తర్వాత స్థలం మంజూరు అయిన తర్వాత పక్కా ఇల్లు మంజూరు చేయబడుతుంది.
నమోదు చేసుకునే విధానం
మీ వివరాలను ‘ఆవాస్ ప్లస్ యాప్’ (Awaas Plus App) ద్వారా నమోదు చేయించుకోవాలి.
మీరు నివసించే సచివాలయం పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా మండల హౌసింగ్ సహాయక ఇంజనీరుని సంప్రదించండి.
లబ్ధిదారులు తమ ఇంటి దగ్గరే ఉండి, ముఖ ఆధారిత నమోదు (Face Recognition) ద్వారా వివరాలు నమోదు చేయించుకోవాలి.
కావలసిన పత్రాలు
పేరు నమోదు సమయంలో ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి:
స్థల ధృవీకరణ పత్రాలు (మీకు స్థలం ఉంటే) జాబ్ కార్డు,ఆధార్ కార్డు, రేషన్ కార్డు,
బ్యాంకు ఖాతా (అకౌంట్) వివరములు.
ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఈ గొప్ప అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
