విజయనగరం: పని ప్రదేశాల్లో లింగ వివక్షత మరియు లైంగిక వేధింపులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీమతి ఎం. భవిత పాల్గొని ప్రసంగిస్తూ “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు నిరోధక చట్టం (POSH Act – 2013) ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన శిక్షలు తప్పవు” అని స్పష్టం చేశారు.
ఆమె మాట్లాడుతూ, ఈ చట్టం ప్రైవేట్, ప్రభుత్వ, అర్ధ ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే ఇంటి పనుల్లో నిమగ్నమయ్యే మహిళలకు కూడా వర్తిస్తుంది అని తెలిపారు. ప్రతి పని ప్రదేశంలో అంతర్గత ఫిర్యాదు కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఫిర్యాదులు స్వీకరించే విధానాలు, దర్యాప్తు విధివిధానాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే చట్టాన్ని పాటించని సంస్థలపై జరిమానాలు విధించే నిబంధన కూడా ఉందని వివరించారు.
న్యాయశాఖ సిబ్బందికి ఈ చట్టం పై అవగాహన కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరూ సోదరభావంతో, గౌరవంతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి శ్రీమతి కె. విజయకళ్యాణి, ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి శ్రీ బి. అప్పలస్వామి, మహిళా కోర్టు జడ్జి శ్రీమతి ఎం. పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీ కృష్ణ ప్రసాద్ మరియు న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు
