శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కొత్తవలస మండలానికి చెందిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు జనసేన పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వానికి ఆకర్షితులై ఈ చేరికలు జరిగాయని నాయకులు తెలిపారు.
విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో కొత్తవలస వైస్ ఎంపీపీ మేలస్త్రి సరస్వతి, ఆమె భర్త మాజీ వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు మేలస్త్రి అప్పారావు, ఎంపీటీసీ సెగ్మెంట్-1కు చెందిన ఎల్లపు వెంకటలక్ష్మి, సూరిబాబు, సెగ్మెంట్-6కు చెందిన పెద్దిరెడ్డి లక్ష్మి పాత్రుడు, నాయకులు ప్రకాశరావు, నారాయణరావు తదితరులు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది ప్రజాప్రతినిధులు, నాయకులు జనసేన పార్టీలో చేరనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్.కోట నియోజకవర్గ ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిల్లా రాందుర్గ, గొరపల్లి రవి, మల్లువలస శ్రీను, సత్తిబాబు, కాశి, దొరబాబు అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
