శివకోడు (కోనసీమ), బుధవారం: రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో ‘పల్లె పండగ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాజోలు నియోజకవర్గం శివకోడు గ్రామంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ దీన్ని ప్రారంభించారు.
రూ. 6,787 కోట్ల అంచనా వ్యయంతో 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. “ప్రతి పల్లెకు సదుపాయం… ప్రతి ఇంటికి సౌభాగ్యం” లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆయన తెలిపారు.
పల్లె పండగ మొదటి దశలో నిర్మించిన 4 వేల కిలోమీటర్ల రహదారుల మాదిరే, ఈ దశలో దీని కంటే రెండింతల అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కొత్తగా 8,571 కిలోమీటర్ల రహదారులకు రూ.5,838 కోట్లు, అలాగే 25 వేల మినీ గోకులాల కోసం రూ.375 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అదనంగా 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లకు రూ.4 కోట్ల వ్యయం ప్రతిపాదించినట్లు తెలిపారు.
సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రజలను ప్రశ్నించే హక్కు ఉంటుందన్న ఆయన, అభివృద్ధి అజెండాతో వచ్చే 15ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి ముందు పల్లె పండగ తొలి దశలో చేపట్టిన పనులను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
