విశాఖపట్నం, ఆగస్టు 23:ఉత్తరాంధ్ర ప్రత్యేక రుచులు, జాతీయ అంతర్జాతీయ వంటకాలు, ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్తో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ సెప్టెంబర్ 5 నుండి 7 వరకు మూడు రోజులపాటు ఘనంగా జరగనుంది.
బీచ్ రోడ్డు, ది పార్క్ హోటల్ సమీపంలోని ఎంజీఎం గ్రౌండ్స్లో ఈ వేడుకను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ప్రకటించారు.శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ విసీ హాల్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫుడ్ ఫెస్టివల్లో సుమారు 30కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయబడతాయని తెలిపారు.
ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రజలకు ప్రవేశం ఉచితంగా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఈ ఫుడ్ ఫెస్టివల్ను జిల్లా పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
పర్యాటకులు, నగర ప్రజలకు కొత్త రుచుల అనుభూతిని అందించడమే లక్ష్యమని కలెక్టర్ వివరించారు.ఫెస్టివల్లో సన్ స్కూల్ ఆధ్వర్యంలో చెఫ్ల కాంటెస్ట్, వివిధ కల్చరల్ ప్రోగ్రామ్లు కూడా నిర్వహించబడతాయి. రోజుకు సుమారు 15 వేల నుండి 20 వేల మంది వరకు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి చర్యలలో భాగంగా ఇటీవల UH3H హెలికాప్టర్ మ్యూజియం, త్వరలో ప్రారంభమయ్యే డబుల్ డెక్కర్ బస్సులు, పునరుద్ధరించిన యాత్రి నివాస్ ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం గురించి కూడా కలెక్టర్ వివరించారు.వైజాగ్ ఫెస్టివల్ నిర్వహణకు సుమారు రూ.15 లక్షల ఖర్చు అవుతుందని, అందులో రూ.5 లక్షలు పర్యాటక శాఖ నుంచి, మిగతా మొత్తం స్పాన్సర్లు, స్టాల్స్ ఏర్పాటు చేసుకునే నామినల్ చార్జీల ద్వారా సమకూరుస్తారని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఫెస్టివల్కు సంబంధించిన గోడపత్రికలను టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ జగదీష్, జిల్లా టూరిజం అధికారి మాధవిలతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
