విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ గురువారం ఉదయం 11 గంటలకు సింహాచలంలోని శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆలయంలోని మంచినీటి సదుపాయాలు, టాయిలెట్లు, పరిశుభ్రత, అన్నప్రసాదం, స్వామివారి ప్రసాదాల నాణ్యత వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణలతో సమావేశమై సౌకర్యాల మెరుగుదలపై చర్చించారు.
కలెక్టర్ భక్తులతో నేరుగా మాట్లాడి దర్శన సమయం, మార్గ సౌకర్యాలు, పరిశుభ్రతపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులు ఆలయ యాజమాన్యం అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, అన్నప్రసాదం మరియు ప్రసాదాల నాణ్యత పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తరువాత కలెక్టర్ మాట్లాడుతూ, “భక్తుల అభిప్రాయాలను తెలుసుకొని దేవాలయాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. పరిశుభ్రతపై మరింత శ్రద్ధ వహించాలని ఆలయ అధికారులకు సూచించాం,” అని అన్నారు.
స్వామివారి దర్శనం అనంతరం స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు కలెక్టర్కు వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.ఈ పర్యటనలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి పంతం శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు, ఎలక్ట్రికల్ ఏఈ తాతాజీ, ఏఈ రవిరాజ్, పి.ఆర్.ఓ. నాయుడు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
