రైతుల పంట నిర్ణయాలకు సహాయపడేలా కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధ (AI) ఆధారిత వాతావరణ అంచనాలను ఉపయోగిస్తోంది. ఖరీఫ్-2025 సీజన్ కోసం, దేశంలోని 13 రాష్ట్రాల్లో స్థానిక మాన్సూన్ ప్రారంభంపై ఒక ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది.
ఈ కార్యక్రమంలో, భారత వాతావరణ శాఖ (IMD) 125 సంవత్సరాల వర్షపాతం సమాచారం, అంతర్జాతీయ AI వాతావరణ మోడళ్ల సహాయంతో, మాన్సూన్ ఎప్పుడు మొదలవుతుందో ముందుగానే అంచనా వేశారు. ఈ అంచనాలు పంటలు విత్తే సమయాన్ని నిర్ణయించుకోవడంలో రైతులకు చాలా ఉపయోగపడ్డాయి.
మాన్సూన్ ప్రారంభంపై చేసిన ఈ అంచనాలను ఎం-కిసాన్ పోర్టల్ ద్వారా 13 రాష్ట్రాల్లోని 3 కోట్ల 88 లక్షల మందికి పైగా రైతులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపించారు. ఈ సందేశాలు హిందీ, ఒడియా, మరాఠీ, బెంగాళీ, పంజాబీ భాషల్లో అందించబడాయి.
ఈ సమాచారం అందుకున్న తరువాత, మధ్యప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లో రైతులతో టెలిఫోన్ ద్వారా సర్వే నిర్వహించారు. అందులో 31 శాతం నుంచి 52 శాతం రైతులు తమ పంటల విషయంలో నిర్ణయాలను మార్చుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా భూమి సిద్ధం చేసే సమయం, విత్తే తేదీ, పంట ఎంపిక వంటి అంశాల్లో మార్పులు చేసుకున్నారు.
ఇదే కాకుండా, వ్యవసాయ రంగంలో రైతులకు మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం ఇతర AI ఆధారిత సేవలను కూడా అందిస్తోంది.
‘కిసాన్ ఈ-మిత్ర’ అనే వాయిస్ ఆధారిత చాట్బాట్ ద్వారా రైతులు ప్రభుత్వ పథకాలపై తమ సందేహాలకు సమాధానాలు పొందుతున్నారు. అలాగే, జాతీయ క్రిమి పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటలపై కీటక దాడులను గుర్తించి, నష్టాన్ని తగ్గించుకునే అవకాశం కలుగుతోంది.
ఈ కార్యక్రమం ద్వారా, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు తగ్గి, రైతులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది.
