అనుమతి లేని వైద్యం, సెలైన్లు, ఇంజక్షన్లు చేస్తే చర్యలు
ఎంటీపీ మందుల కొనుగోళ్లపై డ్రగ్ ఇన్స్పెక్టర్లకు డీఎంహెచ్ఓ ఆదేశాలు
విజయనగరం, సెప్టెంబర్ 1:
ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స మాత్రమే అందించి, అనంతరం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. జీవనరాణి సూచించారు.
విజయనగరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్లు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆర్ఎంపీలు, పీఎంపీలు అధిక మోతాదులో మందులు ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం, అనుమతి లేని ఇంజక్షన్లు చేయడం వంటి వైద్య ప్రక్రియలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇటీవల పత్రికల్లో వచ్చిన ఘటనలపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి, ఆర్ఎంపీలు, పీఎంపీలకు రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం రోగిని సకాలంలో ఆసుపత్రికి తరలించడం ద్వారా ప్రాణాలను కాపాడే బాధ్యత వారిపై ఉందన్నారు.
అలాగే జిల్లాలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఎంటీపీ నిర్వహిస్తున్న ఆసుపత్రులు వినియోగిస్తున్న ఎంటీపీ మందులు, కిట్ల కొనుగోళ్లపై అధికారులు ఆరా తీశారు. ఆయా మందులు డ్రగ్ ఇన్స్పెక్టర్లకు తెలిసే విధంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తున్నారా లేదా అనే అంశంపై వివరాలు సేకరించారు.
సమావేశంలో జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి లలిత, విజయనగరం డివిజన్కు చెందిన ఆర్ఎంపీలు, పీఎంపీలు, డెమో వి. చిన్నతల్లి, డిప్యూటీ డెమో వి. మహేశ్వరి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎం. చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
