Posted in

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. అంగన్వాడీ వర్కర్ తొలగింపు ఆదేశాలు, పీహెచ్‌సీలో పారిశుధ్యంపై ఆగ్రహం

District collector vizianagaram
District collector vizianagaram

గంట్యాడ (విజయనగరం), మే 12: విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం గంట్యాడ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికార యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశారు. రామవరం-3 అంగన్వాడీ కేంద్రంతో పాటు గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, సేవల నిర్వహణలో గుర్తించిన లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


ముందుగా మండల పరిధిలోని రామవరం-3 అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, కేంద్రంలో పిల్లలు మరియు అంగన్వాడీ వర్కర్ గైర్హాజరు కావడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారణ కావడంతో సంబంధిత అంగన్వాడీ వర్కర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.


ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.


అనంతరం గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు మరియు వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుధ్యం ఆశించిన స్థాయిలో లేదని గుర్తించి, వెంటనే పరిశుభ్రతను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా, మందులు ఉచితంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని వైద్య సిబ్బందికి సూచించారు. రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *