విజయనగరం, సెప్టెంబర్ 26 : ఆడ, మగ పిల్లలకు ఇంటి నుండే బాధ్యతలు నేర్పాలని, తల్లి దండ్రులే ముందు సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డా.రాయపాటి శైలజ తెలిపారు. ఆడ, మగ వివక్ష లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలని ప్రస్తుతం పరిస్థితుల్లో ఇద్దరికీ స్వీయ రక్షణ అవసరం ఉందని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో 8 వ రాస్త్రీయ పోషణ్ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుండే ఎక్కువ ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, మహిళలు సురక్షితంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలు పని చేసే చోట కళాశాలల్లో, కార్యాలయాల్లో , ప్రతి సంస్థల్లో మహిళా రక్షణ కమిటీ లు తప్పక ఉండాలని తెలిపారు. మహిళల పై అఘాయిత్యాలు జరిపిన వారి పై శిక్షలు కఠినంగా ఉండాలని అప్పుడే నేరం చేయడానికి భయం కలుగుతుందని అన్నారు.
ప్రభుత్వం పై నమ్మకం ఉంది కనుకనే అనేక మంది బయటకు వచ్చి కేసులు పెడుతున్నారని, మహిళల రక్షణకు, ఆరోగ్యానికి, అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియా వలన మహిళలకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసున్న స్త్రీ శక్తి వలన మహిళల స్వేచ్చ పెరిగిందని, ఆర్ధికంగా భారం తగ్గడం తో వారు మరింత సాధికారత దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ సభ్యులు కలిసేట్టి అప్పల నాయుడు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం , గౌరవం పట్ల ప్రధాని మోడీ కి శ్రద్ధ ఉంది కనుకనే అయన పుట్టిన రోజునాడే మహిళల కోసం అనేక ఉపయోగకరమైన పధకాలను ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర ముఖ్య మంత్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి రవాణా ఖర్చులను మహిళల అవసరాలకు ఉపయోగ పడేలా చేశారన్నారు. గర్భిణీలంతా దేశానికి సేవ చేసే గొప్ప బిడ్డలకు జన్మనివ్వాలని అన్నారు.
స్త్రీ శిశు అభివృద్ధి అధికారి విమలా రాణి , చైల్డ్ వెల్ఫేర్ కమిటి చైర్ పర్సన్ హిమ బిందు, మహిళా కమిషన్ డైరెక్టర్ నాగమణి, డి.చం.హెచ్.ఓ డా. జీవన రాణి, జిల్లా పరిషత్ సి.ఈ.ఒ సత్యనారాయణ, డి.ఆర్.డి.ఏ ఏ.పి.డి సావిత్రి, ఆర్ డబ్ల్యు.ఎస్ ఎస్.ఈ కవిత , సి.డి.పి.ఓ లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 15 మంది గర్భిణీ స్త్రీ లకు పూలు, పండ్లు, పౌష్టికాహారం అందించి సీమంతం చేసారు. అనంతరం నహిలా కమిషన్ ఛైర్పర్సన్ ప్రభుత్వ ఆసుపత్రి లో నున్న వన్ స్టాప్ సెంటర్ ను సందర్శించారు.
