విజయనగరం, నవంబరు 25 ః రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలతో జిల్లా రెవెన్యూ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి “జనసేన పార్టీ” మినహా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
రాజకీయ పార్టీలు ప్రతీ పోలింగ్ బూత్కు తమ ప్రతినిధిగా ఒక ఏజెంట్ను (బిఎల్ఏ) నియమించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి కోరారు. తమ ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించి, వారినుంచి పలు సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గతంలో అదేవార్డుకు చెందిన వ్యక్తిని మాత్రమే బిఎల్ఏగా నియమించే అవకాశం ఉండేదని, తాజాగా దానిని ఎన్నికల కమిషన్ సవరించిందని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని వ్యక్తులను అదే నియోజకవర్గంలో ఎక్కడైనా బిఎల్ఏగా నియమించుకొనే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించిందని డిఆర్ఓ తెలిపారు. బిఎల్ఏను నియమించడం ద్వారా ఒక వ్యవస్థీకృత యంత్రాంగం ఏర్పాటవుతుందని సూచించారు.
అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో15,72,464 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. మార్పులు, చేర్పులు, తొలగింపులకు ఎప్పుడైనా ధరఖాస్తు చేయవచ్చునని సూచించారు.
నిర్ణీత సమయంలో వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. తమ ధరఖాస్తు స్థితిని ఏ పౌరుడైనా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చునని తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో 1847 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా మరో 122 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించామని డిఆర్ఓ వివరించారు.
ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ భాస్కర్రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి నుంచి కుటుంబరావు, వైకాపా నుంచి శ్రీనివాసరెడ్డి, బిజెపి నుంచి అప్పారావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు, సిపిఎం నుంచి టి.సూర్యనారాయణ, బిఎస్పి నుంచి సోములు, ఆప్ నుంచి పైలా రమేష్రాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
