సెప్టెంబర్ 9: ఈనెల 7వ తేదీన సీతమ్మధార శివారు కొండపైన 11 సంవత్సరముల మైనర్ బాలిక పై జరిగిన లైంగిక దాడి అత్యంత దురదృష్టకరమని, దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ అన్నారు.
మంగళవారం ఉదయం కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) ఆవరణలోని వన్ స్టాప్ సెంటర్ లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించి, బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి దోషులను కఠినంగా శిక్షించడంతోపాటు ప్రభుత్వపరంగా బాలికను ప్రత్యేక స్కూల్లో చదివించడంతోపాటు, అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు.
అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడుతూ, మైనర్ బాలికపై లైంగిక దాడులకు పాల్పడిన ఇద్దరూ మైనర్ బాలురేనని అన్నారు. బాలిక ఇంటికి రెండు ఇళ్ళ అవతల ఉన్న కుటుంబంలోని బాలురు ఈ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు.
ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు గ్రహణం మొర్రి ఉందని ఆ అమ్మాయి ఇతర బాలికలతో పోల్చుకుంటే అమాయకంగా ఉంటుందని తెలిపారు.
ప్రతిరోజు స్కూలుకి తీసుకుని వెళ్లి మరల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి తల్లి పలు జాగ్రత్తలు తీసుకుంటుందని, ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులు పనికి వెళ్లడం వలన ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగిందని అన్నారు.
తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల కొందరు పిల్లలు మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. పిల్లల యొక్క నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని తల్లిదండ్రులను కోరారు.
