విధుల నిర్వహణలో అవకతవకలు… కఠిన చర్యలు తప్పవు : ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు
విజయనగరం, జనవరి 3 (జన కమలం):
ఇటీవల కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన విద్యుత్ శాఖకు సంబంధించిన వార్తలపై ఏపీ ఈపీడీసీఎల్ స్పందించింది. ఈ సందర్భంగా శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ఎం.లక్ష్మణరావు మాట్లాడుతూ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) సమర్పించిన నివేదిక ఆధారంగా విధుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడిన ఎనర్జీ అసిస్టెంట్ వి. దినేష్పై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా ఆయన్ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
విద్యుత్ వినియోగ సేవల విషయంలో అక్రమంగా మీటర్ల మార్పిడి చేయడం, బకాయిలు ఉన్న సేవలకు అనధికారికంగా విద్యుత్ సరఫరా కల్పించడం, లంచాలు తీసుకుని విద్యుత్ సరఫరాను కొనసాగించినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నామని ఎస్ఈ స్పష్టం చేశారు.
ఇలాంటి అక్రమాలను ఏపీ ఈపీడీసీఎల్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని స్థాయిల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
