విజయనగరం, నవంబర్ 18 :జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం బొబ్బిలి మండలం పారాది గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, సౌకర్యాలు, రికార్డు నిర్వహణపై ఆరా తీశారు.
తనిఖీలో భాగంగా, మంగళవారం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో టమాట పప్పు వండవలసి ఉన్నప్పటికీ అది తయారు చేయకపోవడం గుర్తించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్లక్ష్యానికి బాధ్యురాలైన అంగన్వాడి వర్కర్ ను తక్షణ చర్యగా సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, గత మూడు రోజులుగా అంగన్వాడి కేంద్రంలో హాజరు నమోదు చేయకపోవడం పట్ల కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధిత సీడీపీఓ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో అంగన్వాడీ సేవల నాణ్యతపై ఎలాంటి రాజీ లేదని, పిల్లల ఆరోగ్యం మరియు పోషకాహారంపై నిర్లక్ష్యాన్ని అసలు సహించబోమని కలెక్టర్ గారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులతో కాసేపు సరదాగా గడిపి పిల్లలతో ముచ్చటించారు.
