విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా గవర్నమెంట్ హాస్పిటల్లో అరుదుగా కనిపించే చెవి కణితి గ్లోమస్ జుగ్యులేర్ను వైద్యుల బృందం విజయవంతంగా తొలగించారు.
విజయనగరం చెందిన G. లక్ష్మి (59) గత మూడు నెలలుగా కుడి చెవిలో నొప్పి, తల తిరుగటం, చెవిలో హోరు, వినికిడి లోపం వంటి సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా ఉపశమనం లేకపోవడంతో, నవంబర్ 10న మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి ENT విభాగాన్ని సంప్రదించారు.ENT వైద్యులు రోగిని సూక్ష్మంగా పరీక్షించి, స్కానింగ్ నివేదికల ఆధారంగా ఇది గ్లోమస్ జుగ్యులేర్ అనే క్లిష్టమైన, అరుదుగా కనిపించే చెవి ట్యూమర్ అని గుర్తించారు.
తదుపరి, నవంబర్ 13న ENT మరియు అనస్థీషియా విభాగాలకు చెందిన వైద్యుల బృందం మూడు గంటలపాటు శ్రమించి కణితిని పూర్తిగా తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని ICUకి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో పాల్గొన్న వైద్యుల సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.
